పవన్కల్యాణ్తో మరో సినిమా?
ఇంటర్నెట్డెస్క్: అగ్ర కథానాయకుడు పవన్కల్యాణ్ వరుస సినిమాలతో తన జోరు కొనసాగిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్రాజు నిర్మించిన రీఎంట్రీ చిత్రం ‘వకీల్సాబ్’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్రాజు నిర్మాతగా పవన్ కల్యాణ్ ఓ కొత్త సినిమాలో నటించనున్నారట. ఇందుకు సంబంధించిన చర్చలు నడుస్తున్నాయని టాక్. కొత్త చిత్రాన్ని ఓ తమిళ దర్శకుడు తెరకెక్కిస్తారని సమాచారం. ఆయనతో కుదరకపోతే తెలుగులోనే విజయవంతమైన చిత్రాలను రూపొందించిన మరో దర్శకుడితో తీస్తారని టాక్ వినపడుతోంది.
ఇటీవల జరిగిన విలేకరుల సమావేశంలో దిల్రాజు మాట్లాడుతూ.. పవన్కల్యాణ్తో మరో సినిమా తీయడానికి ఉత్సాహంగా ఉన్నట్లు ప్రకటించారు. అయితే, పవన్ ఇమేజ్కు తగినట్లు మంచి కథ, కథనాలు ఉంటే తప్పక తీస్తానని అన్నారు. అలాంటి కథ ఒకటి దిల్రాజు దగ్గరకు వచ్చిందట. ప్లాట్ బాగుండటంతో పూర్తి స్క్రిప్ట్ను సిద్ధం చేయిస్తున్నారట. దీనిపై స్పష్టత రావాలంటే చిత్ర నిర్మాణ సంస్థ స్పందించాల్సి ఉంది. ఇప్పటికే పవన్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్తో పాటు ‘హరి హర వీరమల్లు’, హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాను ఓకే చేశారు. ఇవి అయిన తర్వాతే కొత్త చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం కరోనాతో బాధపడుతున్న పవన్ తన వ్యవసాయ క్షేత్రంలో కోలుకుంటున్నారు.