బిగ్బాస్ షో వెంటనే ఆపేయాలి, నాగార్జున ఇంటి ముట్టడికి ఓయూ విద్యార్థుల విఫలయత్నం

Hyderabad: బిగ్బాస్-3ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జూబ్లీహిల్స్లో సినీ నటుడు అక్కినేని నాగార్జున ఇంటి ముట్టడికి ఓయూ విద్యార్థులు శనివారం విఫలయత్నం చేశారు. ఓయూ విద్యార్థి జేఏసీ నేత కందుల మధు ఆధ్వర్యంలో వచ్చిన ఆందోళనకారులు నినాదాలు చేస్తూ ఒక్కసారిగా నాగార్జున ఇంటి వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. అప్పటికే అక్కడ మోహరించిన జూబ్లీహిల్స్ పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ కార్యక్రమంలో ఓయూ జేఏసీ నేతలు చిరుమర్తి రాజు, బోరెల్లి సురేష్, గణేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
‘బిగ్బాస్ నుంచి నాగార్జున తప్పుకోవాలి’
ఖైరతాబాద్: మహిళల్ని కించపరుస్తూ నిర్వహించే బిగ్బాస్ కార్యక్రమాన్ని వెంటనే రద్దుచేయాలని ఓయూ జేఏసీ డిమాండ్ చేసింది. మహిళల పట్ల ఏ మాత్రం గౌరవం ఉన్నా నాగార్జున ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. శనివారం సోమాజిగూడలోని ప్రెస్క్లబ్లో పాత్రికేయురాలు శ్వేతారెడ్డితో కలిసి జేఏసీ నాయకులు చెనగాని దయాకర్, ఆర్ఎన్ శంకర్, దుబ్బా రంజిత్ తదితరులు మాట్లాడారు. జేఏసీ నాయకులు కాంపల్లి శ్రీనివాస్, గ్యార నరేష్, ప్రేమ్, సత్య పాల్గొన్నారు